CM YS Jagan: ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code)పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. దీనిని చాలా పార్టీలు వ్యతిరేకిస్తుండగా.. ఎన్డీఏ పక్షాలు మద్దతు పలుకుతున్నాయి.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో ఉమ్మడి పౌరస్మృతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో ఈ రోజు సమావేశం అయ్యారు సీఎం.. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురి కావాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు.
మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.. ఉమ్మడి పౌరస్మృతి అంశంమీద డ్రాఫ్ట్ అనేది ఇప్పటివరకూ రాలేదు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ, మీడియాలో, పలుచోట్ల చర్చ విపరీతంగా నడుస్తోంది. వాటిని చూసి ముస్లింలు పెద్దస్థాయిలో తమ మనోభావాలను వ్యక్తంచేస్తున్నారు.. అయితే, కొన్ని అంశాలను మీ అందరి దృష్టికి తీసుకు వస్తున్నాను.. ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటేగనుక ఏం చేసేవారన్నదానిపై మీరు ఆలోచనలు చేసి నాకు సలహాలు ఇవ్వండి. ఇక్కడ ఇంకో విషయాన్నికూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ పెద్ద ప్రచారం నడుస్తోంది. ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలని సూచించారు.
ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏ తండ్రైనా, ఏ తల్లి అయినా ఎందుకు భేదభావాలు చూపుతారు? అని ప్రశ్నించారు సీఎం జగన్.. మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీలేదనే విషయాన్ని మనం అంతా స్పష్టం చేద్దాం అన్నారు. భారతదేశం చాలా విభిన్నమైనది. ఈ దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నాయి. ఒకే మతంలో ఉన్న వివిధ కులాలు, వర్గాలకూ వివిధ రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వారివారి మత గ్రంధాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్ లాబోర్డులు ఉన్నాయి. ఏ నియమమైనా ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లాబోర్డుల ద్వారానే చేయాలి. ఎందుకంటే వాటిమీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి. Misinterpretationకు తావు ఇవ్వకుండా ఉంటుంది కాబట్టి. ఒకవేళ మార్పులు అవసరం అనుకుంటే, ఈ విషయంలో సుప్రీంకోర్టు, లా కమిషన్, కేంద్ర ప్రభుత్వం కూడా అందరూ కలిసి, వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సనల్ లాబోర్డ్స్తో మమేకమై, వారి పర్సనల్ లా బోర్డ్స్ ద్వారా ఒకవేళ మార్పులు అవసరమైతే జరగాలి తప్ప వేరే పద్ధతిలో జరిగితే, అది ఇంత భిన్నత్వం ఉన్న మన దేశంలో తగదు.