MCRHRDలో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. ఈ సందర్భంగీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి.. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామన్నారు. నియోజకవర్గాల్లో నిజాయితీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని, అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దన్నారు.
ప్రతీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలెప్ మెంట్ నిధులు కేటాయిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ మంత్రులకు ఈ నిధుల బాధ్యత అప్పగిస్తున్నామని ఆయన అన్నారు. ఇంచార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలి… సమస్యలను పరిష్కరించుకోవాలని, పార్టీ , ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలన్నారు.