NTV Telugu Site icon

CM Revanth : ఇవాళ కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్.. ఖమ్మం పర్యటన రద్దు చేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన వివిధ కేంద్రమంత్రులతో సమావేశాలు అవుతూనే… అధినాయకత్వంతో కూడా చర్చలు జరుపుతున్నారు. మూడురోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్​రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తొలిరెండు రోజులు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. మూడోరోజు బుధవారం పీసీసీ చీఫ్ నియామకం, రాష్ట్ర కేబినెట్​ విస్తరణ, నామినేటెడ్​ పోస్టుల భర్తీపై మంత్రులతో కలిసి కాంగ్రెస్​ హైకమాండ్​తో భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్​విస్తరణపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్​ హైకమాండ్​తో సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రస్తుతం ఆరు కేబినెట్ ​బెర్త్​లు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రధానంగా నాలుగింటి భర్తీపైనే దృష్టిపెట్టారు. హైకమాండ్​కు ​నలుగురి పేర్లతో సీఎం రేవంత్​లిస్టు ఇవ్వగా.. మరో రెండు పేర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రపోజ్​ చేశారు. దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి నలుగురి పేర్లతో రావాలని హైకమాండ్​ సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నేడు కూడా సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. అయితే.. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం పర్యటనను రద్దు చేసుకున్నారు. సాయంత్రం కానీ, అర్థరాత్రివరకు కానీ.. సీఎం, డిప్యూటీలు హైదరాబాద్‌కు రానున్నారు.