NTV Telugu Site icon

CM Revanth Reddy : ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం..

Revanth

Revanth

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇవాళ ఆయన కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోడీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17, 2025తో మోడీ 75 ఏళ్లు నిండుతాయని, ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలన్నారు సీఎం రేవంత్. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన వెల్లడించారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏ కు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని, బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది.. 400 సీట్లు ఎట్లా సాధ్యం? అని ఆయన ప్రశ్నించారు. 13 ఏళ్లు సీఎంగా , 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోడీ.. మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని, దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

అంతేకాకుండా..’సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడంలేదు. దేశ ప్రజలకు మోడీ మాయమాటలు చెబుతున్నారు. ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతోంటే… మోడీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది.. ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దార్ దీన్నిబట్టి తెలుస్తోంది.. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధం.. దేశంలో మోడీ వ్యతిరేక వేవ్ నడుస్తోంది. మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవు… నవనీత్ కౌర్ 15సెకన్ల కామెంట్స్ పై చర్యలు లేవు.. బీజేపీ నేతలపై ఎంహెచ్ఏ కంప్లైంట్ చేయదు.. కానీ ఒక వీడియో వైరల్ కేసులో మాపై ఎంహెచ్ఏ రంగంలోకి దిగింది.. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనం.. బీజేపీ వాషింగ్ మెషిన్ లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా? కాంగ్రెస్ కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోడీని ఒక్కటే అడుగుతున్నా.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించండి.. మోడీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు..

రైతు బంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదు.. పార్లమెంట్ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం.. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్ కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోంది.. యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.. కేసీఆర్ పై నాకు సానుభూతి ఉంది.. మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు.. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారు.’ అని సీఎం రేవంత్‌ అన్నారు.