హైదరాబాద్ జర్నీలో ‘మైక్రోసాఫ్ట్’ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే అని, మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) బోధన ప్రవేశపెడతాం అని సీఎం చెప్పారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీమ్కు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ నూతన భవనం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మైక్రోసాఫ్ట్ నూతన భవనం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘హైదరాబాద్లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణం. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. మీరు హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను’ అని అన్నారు.
Also Read: Bandi Sanjay Kumar: బీసీ జాబితాలో ముస్లింలను చేరిస్తే ఆమోదించే ప్రసక్తే లేదు!
‘భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. మైక్రోసాఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీతో కూడిన అధునాతన తెలంగాణను ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భాగస్వామ్యంతో తెలంగాణ, మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నాయి. ఈ పెట్టుబడి మా స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం చేయడంతో పాటు మెంటార్షిప్, ఏఐ టూల్స్ మరియు గ్లోబల్ నెట్వర్క్ యాక్సెస్ను ఇస్తుంది. మా ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందని గర్వంగా చెబుతున్నా. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీమ్కు ధన్యవాదాలు. ఆవిష్కరణల పట్ల మీ నిబద్ధత, మా తెలంగాణ రైజింగ్ విజన్కు తోడవుతుంది’ అని సీఎం పేర్కొన్నారు.