సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరిగతిన పరిష్కరించేలా కొత్త విధానాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. గ్రీవెన్స్ డే వ్యవస్థపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఇకపై ప్రతి నియోజకవర్గంలో కూడా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లే.. ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ఫీల్డ్ గ్రీవెన్స్ డే నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు.
పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్) విధానంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పని చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజాదర్బార్ తరహాలో పీజీఆర్ఎస్ కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. సింగపూర్లో కూడా ఇదే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం జరుగుతోందని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో కూడా పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా ప్రజలకు మరింత ఉపయోగం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావడమే కాకుండా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అర్జీలు తీసుకుని కార్లో పెట్టుకోవద్దు. సమస్యలకు నిజంగా పరిష్కారం చూపాలి’ అంటూ అధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఫిర్యాదులను కేవలం స్వీకరించడం కాదు.. వాటిని వేగంగా పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి నెలలో కనీసం నాలుగు సార్లు ఒక నియోజకవర్గాన్ని సందర్శించాలని కలెక్టర్లకు ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం గుడ్విల్ మిషన్లా క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు. అలాగే అధికారులపై వీడియో కాన్ఫరెన్సుల భారం తగ్గించే దిశగా కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అన్ని వీడియో కాన్ఫరెన్సులను వారానికి ఒక రోజుకే పరిమితం చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎక్కువ సమయం కేటాయించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
