కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి మద్ధతుగా నిలుస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందని వ్యాఖ్యానించారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని తెలిపారు. సమన్వయంతో పని చేశారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు చెప్పారు. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి పీఎంను ఆహ్వానించడానికి గల కారణాన్ని సీఎం చెప్పారు.
READ MORE: IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు ఇవే.. షెపర్డ్ స్థానం ఎంతంటే?
“అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమైంది. అమరావతి ఆవశ్యకతను వివరించేందుకే ప్రధాని చేతుల మీదుగా పనులు పున:ప్రారంభించాం. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తిగా మారుతుందన్న ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయి. రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించాయి. నిన్నటి సభతో అమరావతి రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. దేశానికి అమరావతి రోల్ మోడల్గా రూపొందుతుందని ప్రధాని అనడం రాష్ట్రానికి గర్వ కారణం. ప్రధాని మోడీ ప్రసంగం ప్రజల పట్ల ఉన్న అభిమానానికి, రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది. మంత్రులు, నేతలకు అప్పగించిన పనులను బాధ్యతగా వ్యవహరించి బ్రహ్మాండంగా పని చేశారు. లక్షల మంది ప్రజలు పోటెత్తినా ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం. అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా, పాజిటివ్ దృక్పధంతో కార్యక్రమం జరిగింది.” అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
READ MORE: Off The Record: వైసీపీలోకి తిరిగి వెళ్లడానికి ఇగో అడ్డొస్తుందన్న నేత ఎవరు? ఏంటా పరిస్థితి?
సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై అన్ని వర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని మంత్రులు అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా మంత్రులు పార్థసారధి, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, నారాయణ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.