CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?

Cbn

Cbn

CM Chandrababu: పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పొదుపు చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రధాని సూచించిన ఎనిమిది అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరిన చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. పొదుపు చర్యలు తప్పనిసరి అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా ఈ తరహా విధానాలను అమలు చేసే పరిస్థితులు వస్తాయని అభిప్రాయపడ్డారు. దేశంలో దుబారాను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న చంద్రబాబు, పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో తిరగడం ఒక ఫ్యాషన్‌గా మారిందన్నారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలుస్తూ కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లను కూడా అవసరానికి తగ్గట్టు కుదించుకోవాలని అభిప్రాయపడ్డారు.

విదేశీ పర్యటనలను తగ్గించాలని ప్రధాని మోడీ చేసిన సూచనలను కూడా పాటించాలని సీఎం కోరారు. భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, విదేశాలకు వెళ్లడం కంటే దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని అన్నారు. “నా దేశం – నా బాధ్యత” అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రజలు ఆలోచించాలని సూచించారు. అయితే, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందనే అంశంపై రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.