ఆంధ్రప్రదేశ్ను విజ్ఞాన–సాంకేతిక పరిశోధనల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST)’ పేరుతో తిరుపతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిలోని IIT–IISER కాంబినేషన్తో AP FIRST రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రం ద్వారా అత్యాధునిక పరిశోధనలు, ఇన్నోవేషన్కు వేదికగా నిలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువత భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఈ కేంద్రంలో పరిశోధనలు సాగనున్నాయి.
Read Also: MSVG : 4 రోజులు.. 200 కోట్లు.. మెగా మాస్ ఆన్ డ్యూటీ!
ఈ నేపథ్యంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ–డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల సలహాదారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పరిశోధనలపై, భవిష్యత్ సాంకేతిక అవసరాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యువతకు, రాష్ట్రానికి మేలు జరిగేలా AP FIRST అతిపెద్ద రీసెర్చ్ కేంద్రంగా రూపుదిద్దుకోవాలని సూచించారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ను జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. AP FIRST ద్వారా ఏరోస్పేస్–డిఫెన్స్, డిజిటల్ టెక్నాలజీలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి పరిశోధనలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేంద్రం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్రానికి దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని… ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు.. ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ-AP FIRST పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఎయిరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ-సైబర్ సెక్యూర్టీ, సెమీ కండక్టర్ల డివైసెస్-సెన్సార్లు, క్వాంటం టెక్నాలజీ, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రొత్సహిస్తోంది. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు…వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇలా వచ్చే కంపెనీలకు… పరిశ్రమలకు నైపుణ్యమున్న యవతను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ మేరకు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా…స్టార్టప్ కంపెనీలను ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఓ అతి పెద్ద రీసెర్చ్ కేంద్రం అవసరం. తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ-ఫస్ట్ వ్యవస్థ ఆ అవసరాలను తీర్చేలా… రాష్ట్రంలోని యువతకు సహకరించేలా పూర్తి స్థాయిలో పనిచేయాలి. తిరుపతిలోని ఐఐటీ-ఐఐఎస్ఈఆర్ రెండు ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లో ఏపీఫస్ట్ ఏర్పాటు కాబోతోంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలి. ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరపాలి.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.
వర్శిటీలు, కంపెనీలు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో అనుసంధానం
“రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన నిరంతరం ఏపీని అభివృద్ధి చేయడంతోపాటు…యువతకు చక్కటి ఉపాధి కల్పించడంపైనే ఉంటుంది. సంక్షేమానికి-అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఆలోచన చేస్తుందో… యువతకు మెరుగైన అవకాశాలు అందించే విషయంలోనూ అదే స్థాయిలో ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీంట్లో భాగంగానే ఏపీ ఫస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. యూనివర్శిటీలు, వివిధ రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న కంపెనీలతో ఏపీ ఫస్ట్ సమన్వయం చేసుకోవాలి. ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్శిటీల్లో విద్యార్థులు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వాటిని అందిపుచ్చుకోవాలి. దీంతో యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు పరిశ్రమలు, కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. దీంతో పాటు అందుబాటులోకి వస్తోన్న టెక్నాలజీలు ఏంటీ…? ఏయే రంగాల్లో అభివృద్ధి జరుగుతోందనే విషయాలను గుర్తించి.. వాటిని కరిక్యులమ్లో చేర్చేలా విద్యా సంస్థలతో సంప్రదింపులు జరపాలి. ఈ మేరకు ఆయా విద్యా సంస్థలకు కరిక్యులమ్ ప్రిపేర్ చేసేలా ఏపీ ఫస్ట్ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐటీని ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు తెలుగువాళ్లు ఐటీలో మేటిగా ఉన్నారు. అలాగే ఫార్మా రంగంలో భవిష్యత్ ఉంటుందని గుర్తించడం వల్లే తెలుగు రాష్ట్రాలు ఫార్మాలో అగ్రభాగాన ఉన్నాయి. ఇదే తరహాలో భవిష్యత్ రంగాలను నేటి యువత అందిపుచ్చుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. యువత భవిత కోసం… స్టార్టప్ కంపెనీలకు మరింత చేయూతనివ్వడం కోసం ఏపీ ఫస్ట్ వ్యవస్థ కృషి చేయాలి. వచ్చే మూడేళ్లల్లో కీలక పురోగతి కనబరిచేలా ఏపీ ఫస్ట్ పని చేయాలి.” అని ముఖ్యమంత్రి సూచించారు.
డ్రోన్లతో సేవలందించవచ్చని నిరూపిద్దాం
“డ్రోన్ కార్పొరేషన్ను మరింత బలోపేతం చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో డ్రోన్లను వినియోగించి బాధితులకు సేవలు అందించాం. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో డ్రోన్లను వినియోగించుకుని ప్రజలకు సేవలు అందించేలా చూడాలి. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి వాటిల్లో డ్రోన్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఫ్యూచర్ టెక్నాలజీలు.. కానీ వీటికి మనం ఇప్పటి నుంచే సంసిద్దత కావాల్సి ఉంది. వివిధ దేశాల్లో డ్రోన్ల ద్వారా ఎలాంటి సేవలు అందుతున్నాయోననే అంశాన్ని పరిశీలించాలి… అధ్యయనం చేయాలి. టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. టెక్నాలజీని అందరూ అందిపుచ్చుకున్నాక… మనం అప్పుడు మేల్కొనే కంటే… ముందుగానే టెక్నాలజీని అందిపుచ్చుకునేలా మన వ్యవస్థలను సిద్దం చేయాలి. డ్రోన్ కార్పొరేషన్ నిపుణులతో కూడిన సలహా బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఇంటర్నేషనల్ డ్రోన్ డే నాటికి డ్రోన్ల ద్వారా సేవలు ఏ విధంగా అందించవచ్చోననే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలకు కళ్లకు కట్టేలా చూపాలి. డ్రోన్ ట్యాక్సీ, డ్రోన్ అంబులెన్స్ వంటి అంశాల్లో లోతుగా అధ్యయనం చేయండి. కేంద్రంతో సంప్రదింపులు జరిపి.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్మెంట్ వ్యవస్థ తరహాలో డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చేమోననేది పరిశీలించండి.”అని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏరో స్పేస్ డిఫెన్స్ సలహదారు సతీష్ రెడ్డి, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారు అమిత్ దుగర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ, ప్రొఫెసర్ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ కల్నల్ పీఎస్ రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.