CM Chandrababu Naidu: రెండేళ్ల క్రితం శపథం చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్లిపోయిన అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు.. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో రెండేళ్ల తర్వాత అదే సభలో అడుగుపెట్టారు.. ఈ సందర్భంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.. తనను అన్ని రకాలుగా అవమానించిన ఈ సభలో విపక్ష నేతగా ఈ కౌరవ సభలో ఉండలేను.. మళ్లీ గెలిచి గౌరవ సభలో అడుగుపెడతానంటూ 2021లో సభ నుంచి వెళ్లిపోయిన ఆయన.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. శాసనసభకు చేరుకున్నారు.. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు స్వాగతం పలికారు.. ఇక, తొలుత శాసన సభ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు.. ఆ తర్వాత శాసన సభలో అడుగుపెట్టారు చంద్రబాబు.
అయితే, 2021 నవంబర్ 19వ తేదీ తర్వాత చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.. ఇన్నేళ్లు తాను పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ.. ఇలాంటి సభలో నేనుండను.. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను.. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు.. మీ అందరికీ ఓ నమస్కారం.. అంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు చంద్రబాబు.. అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగినా.. ఆయన సమావేశాలకు వెళ్లింది లేదు.. కానీ, ప్రజాక్షేత్రంలో వైసీపీపై పోరాటం చేస్తూనే వచ్చారు.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-బీజేపీతో కలిసి పోటీ అఖండ విజయాన్ని అందుకున్నారు.. అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లోనూ కీలకంగా మారారు.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.