Site icon NTV Telugu

AP CM Chandrababu: అమరావతికి రైల్వే లైన్‌.. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు

Cm Chandrababu

Cm Chandrababu

AP CM Chandrababu: అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతికి రైల్వే లైన్‌ ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే లైన్‌తో దేశంలోని అన్ని నగరాలకు అమరావతి కనెక్ట్‌ అవుతుందని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్లలో ఈ రైల్వే లైన్ పూర్తవుతుందన్న ఆయన.. మూడేళ్లలోనే పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భూసేకరణకు అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. వచ్చే నెలలో ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ప్రధానిని సీఎం ఆహ్వానించారు. విశాఖపట్నం రైల్వే జోన్‌ చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని.. దీనికి అవసరమయ్యే భూమికి సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Read Also: Andhra Pradesh: ఏపీ రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లు

ఏపీకి ఇది చారిత్రాత్మక రోజు అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అభివర్ణించారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు. రాజధాని నుంచి ఏ ప్రాంతానికైనా అనుసంధానం కీలకమని తెలిపారు. 10 రోజుల సమయంలో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలు కేంద్ర కేబినెట్‌ ముందుకు తెచ్చారని చెప్పారు. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ ఏపీకి పెద్ద బూస్ట్ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ ప్రజల కలను కేంద్రం నెరవేర్చింది.. పవన్ చొరవతో రైల్వేలైన్‌కు మోడీ ఆమోదం తెలిపారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. పరిటాల వద్ద మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ వస్తుందని తెలిపారు. ఏపీలో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం లభించింది. కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతికి హైదరాబాద్‌-చెన్నై-కోల్‌కతాతో రైల్‌ కనెక్టివిటీ రానుంది. ఇప్పటికే ఈ రైల్వే లైన్‌కు సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర రాజధానికి అమరావతికి రవాణా కనెక్టివిటీని పెంచి అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. అమరావతి రైల్వే లైన్‌లో పలు గ్రామాలకు కూడా రైల్వే కనెక్టివిటీ రానుంది. ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

Exit mobile version