ఏపీలో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్ఎస్కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోడౌన్లలోని బియ్యం నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని, ఉల్లి కొనుగోళ్లతో పాటు భవిష్యత్తు డిమాండ్కు తగినట్లు సాగును ప్రోత్సహించాలని సూచించారు. స్వయం సహాయక బృందాల ద్వారా కిచెన్ గార్డెన్లను వ్యవస్థీకృతం చేసి కూరగాయల ధరలను నియంత్రించవచ్చని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 50.7 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా ప్రకాశం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని సీఎం వెల్లడించారు. ఖరీఫ్లో 30.84 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా, ఎల్ నినో కారణంగా 79 శాతం భూముల్లోనే పనులు ప్రారంభమయ్యాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే రూ. 60 కోట్లతో కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేశామని, 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీతో అందించామని తెలిపారు.
వర్షాధార పంటలు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు రూ. 190 కోట్లు కేటాయించామని, ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా, పశువులకు నీరు, తగినంత పశుగ్రాసం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హంద్రీ-నీవా ద్వారా చివరి భూములకు, తాగునీటికి ఇబ్బంది లేకుండా నీటిని అందిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. విపత్తు సమయాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఎల్ నినో సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

