Bhatti Vikramarka Peoples March Padayatra: ప్రతి ఇంటి గడప తాకుతూ.. ప్రతీ గుండెను పలకరిస్తూ.. మహిళలు, యువకులు, రైతులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, గొల్ల కురుమలు, చిరు వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, వృద్ధులు.. అందరినీ కదిలిస్తూ.. వారి కష్టాలు తెలుసుకుంటూ.. వారి ఆశీర్వాదం పొందుతూ.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తూ పట్టు వదలని విక్రమార్కుడిలా.. పీపుల్స్ మార్చ్ పేరుతో ముందుకు సాగుతున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. గ్రామాలలో పండుగలా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కదులుతోంది.. పాలకులకు పాఠం నేర్పాలనే లక్ష్యంతోనే ప్రభంజనంతో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగుతుంది అంటున్నారు విక్రమార్క.. నడకలో ఉత్సాహం నింపుతూ.. జనంతో మమేకమవుతూ.. సమస్యలు వింటూ.. పరిష్కార మార్గాలు చూపుతూ.. వచ్చేది మా ప్రభుత్వమే ఇక, మీ కష్టాలు అన్నీ తీరుస్తాం అని అభయం ఇస్తూ వడివడిగా అడుగులు వేస్తున్నారు.. ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వచ్చే నాలుగు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది ఇక చూస్కోండి అంటూ అంటూ వార్నింగ్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాలతో.. దశాబ్దాల పోరాటాల ఫలితంగా.. సోనియమ్మ సంకల్పంతో.. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నాం.. స్వేచ్ఛా, సమానత్వంతో, ప్రజాస్వామిక తెలంగాణ దిశగా పయనిద్దాం ! అని పిలుపునిస్తున్నారు.. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నీకు ఇస్తున్నా హామీలు ఇవే.. 2 లక్షల రైతు రుణమాఫీ, పంటకు మద్దతు ధర, ఇందిరమ్మ రైతు భరోసా, కర్మాగారాలు , పంటల బీమా పథకం & రైతు బీమా, ధరణీ పోర్టల్ రద్దు , నాణ్యమైన విత్తనాల సరఫరా , ప్రతి ఎకరాకు సాగు నీరు, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.. ఆశలు నెరవేర్చేందుకు.. ఆశయాలు సాధించేందుకే నా ఈ పయనం అంటున్నారు.. అడుగడుగునా ప్రజలతో మమేకం అవుతూ.. జనమే మనమై.. మనమే జనమై అంటూ ముందుకు కదులుతున్నారు..

సీఎల్పీ నేత జననాయకుడు భట్టి విక్రమార్క మార్చి 16న చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 85వ రోజు నాటికి 996 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ పాదయాత్రలో 500 పైగా గ్రామాలు.. తాండాలు, పల్లెలు, పట్టణాలు చుట్టేస్తూ ముందుకు సాగుతున్నారు.. గిరిజనులు, ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారీటీలు, అట్టడుగు వర్గాలు, అణగారిన ప్రజలు.. భట్టి విక్రమార్కను జన నాయకుడిగా పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చే చుక్కానిలా భట్టి విక్రమార్క పాదయాత్ర ముందుకు సాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అట్టడుగు, అణగారిన వర్గానలు పార్టీకి దగ్గర చేయడంలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయం సాధించింది అంటున్నారు విశ్లేషకులు.. మార్చిన 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజరహాత్నూర్ మండలం పిప్పిరి గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఇప్నటికే బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్ పూర్, జనగామ, అలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ నగర్, పరిగి, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగించారు.. పాదయాత్ర కొనసాగిన నియోజకవర్గాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడంతో పాటు.. కేడర్ లో సరికొత్త జోష్ నెలకొందని చెబుతున్నారు..
ప్రతీకూల పరిస్థితులు వచ్చినా వెనక్కి తగ్గడం లేకు భట్టి విక్రమార్క.. గాలి దుమారాలు.. విపరీత ఎండలు.. ఊహించని భారీ వర్షాలు.. అయినా కూడా తనతో నడిచే కార్యకర్తలతో సమానంగా టెంట్ లో ఉంటూ.. వారితో కలిసి తింటూ.. కలియ తిరుగుతున్న భట్టి విక్రమార్క.. సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా మారారని చెబుతున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇప్పటికే పాదయాత్ర ముగియగా.. నల్గొండ జిల్లాలో అడుగుపెట్టారు. సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టనుంది భట్టి పాదయాత్ర.. ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర పూర్తి అవుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.. ముగింపు సభకు లక్షల్లో ప్రజలు తరలివస్తారని అంచనావేస్తున్నారు..

మార్చి 16న పాదయాత్ర పిప్పిరి గ్రామం నుంచి ప్రారంభం కాగా.. మార్చి 22న ఆసిఫాబాద్ నియోజకవర్గం కేరి మేరి మండలం జరీ గ్రామంలో 125 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు.. ఏప్రిల్ 14న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు.. ఏప్రిల్ 16న 300 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి బ్రిడ్జి పైన కేక్ కట్ చేసి ముందుకు సాగారు భట్టి.. ఏప్రిల్ 29 జనగామ జిల్లా నార్మెట్ట వద్ద 500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి కాగా.. మే 25న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుక్వేందర్ సింగ్ సుక్ ముఖ్య అథిధిగా హాజరయ్యారు.. ఇక, జూన్ 10న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతోంది.. ఈ సందర్భంగా దేవరకొండలో నిర్వహించే సభకు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రంజిత్ రంజన్ ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.. వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా గుమ్మడవెల్లిలో పైలాన్ ఆవిష్కరించనున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.







