National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!

Nethanna Sevalo Scheme

Nethanna Sevalo Scheme

Nethanna Sevalo Scheme: బాపట్ల జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయాన్ని సీఎం విడుదల చేయనున్నారు. ‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.179 కోట్లను విడుదల చేయనుంది. చీరాలలో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

చేనేత రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు నేతన్న కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారు. సీఎం చంద్రబాబు ఉదయం 10.30 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10.50 గంటలకు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11.05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 1.35 గంటలకు జాండ్రపేటలోని చేనేతల వర్క్‌షాప్‌ను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. అక్కడ ‘నేతన్న సేవలో’ పథకం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. చేనేత రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 4.10 గంటలకు కొత్తపేటలో టీడీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యకలాపాలు, స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించే అవకాశం ఉంది. సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం 4.45 గంటలకు సీఎం తన క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు.