Chandrababu: వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ లెక్కలు తారుమారయ్యాయని.. 11 మందికి సీట్లు మార్చేశారని ఆయన అన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఊహించలేదని.. ఓ చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుబాటు అవుతారని ఆయన ప్రశ్నించారు. దళితులు, బీసీలనే బదిలీ చేశారని.. బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. అక్కడ బీసీ అభ్యర్థిని నిలపొచ్చు కదా అని చంద్రబాబు అన్నారు. ఇంత మందిని బదిలీలు చేసిన జగన్.. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదన్నారు. జగన్ మనుషులు.. బినామీలను ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. పేదవారి సీట్లే మారుస్తారా.. 150 సీట్లు మార్చినా వైసీపీ గెలవదన్నారు. ప్రజలను టేకిట్ గ్రాంటెడుగా తీసుకోవడం దారుణమన్నారు.
Read Also: YSRCP MP Vijayasai Reddy: ఏపీలో ఓట్ల గందరగోళంపై ఫిర్యాదు చేశాం..
టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. “ఇప్పటికే చాలా మార్పు వచ్చింది.. నోటిఫికేషన్ వస్తే మరింతగా మార్పు వస్తుంది. అందరి అభిప్రాయాలతో అభ్యర్ధులను నిలబెడతాం. ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాం. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అందరూ సహకరించాలి.. మార్పునకు నాందీ పలకాలి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తాం. పొత్తులో ఉన్నాం.. సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాం. ఈసారి అభ్యర్థుల ఎంపిక విధానం వినూత్నంగా ఉండబోతోంది. వైసీపీలోని అసంతృప్తులు మాకెందుకు..? అక్కడ టిక్కెట్ రాలేదని మా దగ్గరకు వస్తామంటే మాకు అవసరం లేదు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచన చేస్తాం. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడగను అని చెప్పిన జగనుకు.. ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిది..? పక్క రాష్ట్రాల్లో ఓటు లేని వారికి.. ఈ రాష్ట్రంలో ఓటు ఉంటే.. వాళ్లూ ఓటేయొద్దని ఎలా చెబుతారు..? ఈ ప్రభుత్వం సవ్యంగా ఉంటే వాళ్లు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారు..? జగన్ చేసేవన్నీ చెత్త పనులే. రిషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో రూ. 500 కోట్లతో భవనం కడతారా..? రిషికొండలో కట్టడాలు కట్టొద్దని చెప్పినా కొండను తవ్వేస్తారా..? చట్టం సీఎంకు వర్తించదా..? జగన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడే కాదు. మూడు నెలల్లో జగన్ ఇంటికి వెళ్తున్నారు.. తరలింపు సాధ్యమా..? ఎలా తరలిస్తారు..? సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు.” అని చంద్రబాబు అన్నారు.