AP Election Results 2024: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఉదయ 5 గంటలకే కౌంటింగ్ ఏజెంట్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు.. ఈ టెలికాన్ఫరెన్స్ లో పురంధరేశ్వరి, నాదెండ్ల మనోహర్, 3 పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డాం. కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు.. నిబంధనలకు పట్టుబట్టాలి. అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దు అని సూచించారు.
ఇక, కంట్రోల్ యూనిట్ నంబర్ ప్రకారం సీల్ ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను.. కౌంటింగులో వచ్చిన ఓట్లను సరి చేసుకోవాలని సూచించారు చంద్రబాబు.. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీపడొద్దన్నారు. ప్రతి ఓటూ కీలకమే అనేది ఏజెంట్లు గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కాగా, ఏపీలో పోలింగ్, పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని.. అల్లర్లకు ఆస్కారం లేకుండా పోలీసుల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 1,985 సున్నిత ప్రాంతాలు గుర్తించారు. రాష్ట్రానికి 50 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను దించారు.. కౌంటింగ్కు 5,600 మంది కేంద్ర బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. ఇక, ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించిన విషయం విదితమే.