Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గత నెల 9వ తేదీన అరెస్ట్ చేసింది సీఐడీ.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు చంద్రబాబు… అయితే, విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు విధించిన రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది.. దీంతో.. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును వర్చువల్గా ప్రవేశపెట్టనున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. కాగా, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును గత నెల 9వ తేదీన సీఐడీ అరెస్ట్ చేయగా.. ఆయన రిమాండ్ నేటితో 41వ రోజుకు చేరింది..
Read Also: Balakrishna Fans: బాలయ్యా.. మజాకా..టపాసుల మోత మోగించిన ఫ్యాన్స్..
మరోవైపు.. తొలి రిమాండ్ ముగిసిన తర్వాత చంద్రబాబు కోర్టు ఎదుట వర్చువల్గానే హాజరయ్యారు.. అప్పట్లో కోర్టు సీఐడీ కస్టడీకి అనుమతించడంతో అధికారులు జైల్లోనే చంద్రబాబును రెండు రోజుల పాటు ప్రశ్నించారు.. ఇక, ఆ తర్వాత కూడా వర్చువల్ విధానంలోనే చంద్రబాబును న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు జైలు అధికారులు.. జడ్జి ఆయన జ్యుడీషియల్ రిమాండ్ను పొడిగిస్తూ వచ్చారు.. నేటితో చంద్రబాబు రిమాండ్ గడువు ముగియనుండగా.. ఈ రోజు కూడా ఆయన్ని వర్చువల్గా ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు. అయితే, చంద్రబాబుకు స్కిల్ కేసులో విముక్తి లభిస్తోందా? మరోసారి రిమాండ్ పొడిగింపు తప్పదా? అనేది ఆసక్తికరంగా మారింది.. ఏసీబీ కోర్టుతో పాటు.. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా చంద్రబాబు పిటిషన్లపై విచారణ సాగుతోన్న విషయం విదితమే.