Chandrababu and Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల్లో జట్టుకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇప్పటికే ఉమ్మడిగా ప్రచారం ప్రారంభించాయి.. ఆ పార్టీల చీఫ్లు కూడా రంగంలోకి దిగనున్నారు.. మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఓ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం విదితమే కాగా.. టీడీపీ-జనసేన ఉమ్మడిగా మరికొన్ని సభలు, సమావేశాలు నిర్వహించాయి.. ఇక, నేడు, రేపు గోదావరి జిల్లాల్లో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఈ రోజు తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో.. రేపు పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం సాగనుంది..
Read Also: Nitish Reddy-Pat Cummins: నితీష్ రెడ్డి అద్భుతం.. ప్యాట్ కమిన్స్ ప్రశంసలు!
కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇద్దరు నేతలు సంయుక్తంగా హాజరవుతున్న సభలు ఇవే.. తణుకు నరేంద్ర సెంటర్లో సాయంత్రం 4 గంటలకు, నిడదవోలులో రాత్రి 7 గంటలకు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో పాల్గొనేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. నేరుగా తణుకుకు రెండు హెలికాఫ్టర్లలో చేరుకుంటారు.. ఈ రోజు ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పాల్గొననున్నారు.. తణుకు నుంచి నిడదవోలు వరకు జరగనున్న రోడ్ షోలో పాల్గొంటారు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి.. నిడదవోలు గణేష్ చౌక్ లో జరగనున్న బహిరంగ సభలో ముగ్గురు నేతలు పాల్గొని ప్రసంగిస్తారు.. సభ అనంతరం నిడదవోలులోని తిరుమల సాయి కళ్యాణమండపంలో చంద్రబాబు బస చేయనుండగా.. రాజమండ్రి హోటల్లో పవన్ కల్యాణ్ బస చేస్తారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అమలాపురం పర్యటన ఖరారు చేశారు.. రేపు రాత్రి 7 గంటలకు అమలాపురం చేరుకోనున్న చంద్రబాబు.. అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో రాత్రి 8.30 వరకు జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రికి కిమ్స్ మెడికల్ కళాశాలలో బస చేయనున్నారు.. ఈ సభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.