Petrol Price Reduce: కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించింది. లక్షద్వీప్లో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం రూ.15 తగ్గించింది. లక్షద్వీప్లోని ఆండ్రోట్, కల్పేని దీవుల్లో లీటరుకు రూ.15.3, కవరత్తి, మినికాయ్లో లీటరుకు రూ.5.2 తగ్గింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాక ముందే.. ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం శుక్రవారం (మార్చి 15) పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించిన సంగతి తెలిసిందే.
Read Also: Election Commission: జమ్మూ కాశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన
కేంద్ర పాలిత ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రకటించారు. లక్షద్వీప్ ప్రజలకు శుభవార్త అని ఆయన అన్నారు. ఆండ్రోట్, కల్పేని దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 15.3, కవరత్తి, మినీకాయ్లో లీటరుకు రూ. 5.2 చొప్పున తగ్గాయి. ఆయన మాట్లాడుతూ.. ‘ఇంతకుముందు నాయకులు కుటుంబ సమేతంగా సెలవుల కోసం ఇక్కడికి వచ్చి వెళ్లిపోయేవారు. లక్షద్వీప్ ప్రజలను తన కుటుంబంగా భావించిన తొలి నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు.
అదే సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ఒకరోజు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2 తగ్గాయి. దాదాపు రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72తో పోలిస్తే ఇప్పుడు రూ.94.72 కాగా, డీజిల్ ధర రూ.89.62కి బదులుగా రూ.87.62గా ఉందని ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ తెలిపింది.