Current Bill: ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు మధ్య తరగతి వ్యక్తి బతకడమే కష్టంగా మారింది. ఏ వస్తువును ముట్టుకున్న ధరల మంటమండుతోంది. కాస్తంత ఆ మంట నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్ వేస్కుందాం అంటే కరెంట్ బిల్ షాక్ కొడుతోంది. దీంతో చావ లేక బతకలేక సామాన్యుడు నానాయాతన పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజలపై నిరంతరం అటు పన్నులు, ఇటు చార్జీలు పెంచుకుంటూ పోతున్నాయి. ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్లులు అమాంతం పెంచేశాయి. వినియోగం తక్కువగా ఉన్నా బిల్లు ఎక్కువగా వస్తోందని జనాల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే కేంద్రం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించే చల్లటి వార్తను చెప్పింది. దీంతో రానున్న రోజుల్లో మీ కరెంటు బిల్లులు భారీగా తగ్గే అవకాశం ఉంది. సామాన్య, మధ్య తరగతి విద్యుత్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020 చట్టంలో సవరణలు చేసింది. దీని ద్వారా వినియోగదారులు తమ కరెంట్ బిల్లులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. టైమ్ ఆఫ్ డే (టీవోడీ) టారిఫ్ విధానం ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ టారిఫ్ విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వినియోగదారులకు విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also:WHO: కరోనా పోయింది.. కానీ మరో ముప్పు ముందుంది.. భయపడుతున్న WHO
టైమ్ ఆఫ్ డే టారిఫ్ సిస్టమ్ అనేది గరిష్ట విద్యుత్ డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. 10 కిలోవాట్ల కంటే ఎక్కువ వాడకం ఉన్న వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఇది ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఇవి కాకుండా వ్యవసాయ వినియోగదారులు మినహా మిగిలిన వినియోగదారులందరికీ ఇది ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ టారిఫ్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే వారికి సోలార్ హవర్స్ లో 20 శాతం తక్కువగా ఉంటుంది. అలాగే పీక్ డిమాండ్ సమయాల్లో కరెంట్ 10 నుంచి 20 శాతం ఎక్కువగా ఉంటుంది. టీఓడీ నిబంధనలను కచ్చితంగా పాటించే వారికి ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మీటరింగ్ నిబంధనలలో చేసిన సవరణల ప్రకారం, స్మార్ట్ మీటర్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులపై ఎటువంటి పెనాల్టీ ఛార్జీలు విధించబడవు. ఈ మీటర్లను ఇన్స్టాల్ చేసే ముందు గరిష్ట డిమాండ్ నమోదు చేయబడుతుంది కాబట్టి, పెనాల్టీకి అవకాశం ఉండదు. వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించాలనే ఉద్దేశంతో విద్యుత్తు నిబంధనలను సవరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Read Also:Sajjala Ramakrishna Reddy: పవన్ రాజకీయ నాయకుడే కాదు.. కులంపైనే యాత్ర..!