NTV Telugu Site icon

Telangana: రామగుండం- మణుగూరు రైల్వే కోల్‌ కారిడార్ కు కేంద్రం పచ్చజెండా..

Manuguru

Manuguru

రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందు కోసం భూ సేకరణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2, 911 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణంతో దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గబోతుంది. పెద్దపల్లి–మణుగూరు రైల్వే లైన్​ 207 కిలో మీటర్ల పరిధిలో సింగరేణి కోల్‌‌‌ ‌బెల్ట్‌‌‌‌లను కలుపుతూ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైల్వే లైన్​ నిర్మాణం చేపట్టనున్నారు.

Read Also: Rathnam : ఓటిటీలోకి వచ్చేసిన విశాల్ యాక్షన్ మూవీ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

కాగా, ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లను కూడా గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ లైన్​ నిర్మాణం పూర్తైతే ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను సందర్శించడం కూడా ఈజీ అవుతుంది. ప్రస్తుతం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ప్రయాణికులు భద్రాద్రి కొత్తగూడెం వెళ్లాలంటే కాజీపేట మీదుగా తిరిగి పోవాల్సి పరిస్థితి ఏర్పాడింది. కొత్త రైల్వే లైన్​ పూర్తైతే పెద్దపల్లి నుంచి నేరుగా ములుగు, భూపాలపల్లి మీదుగా కొత్తగూడెం వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో వందల కిలో మీటర్ల దూరం తగ్గిపోతుంది. దీంతో పాటు ఈ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి కూడా చెందుతుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్లు తొందరలోనే భూసేకరణ పనులను స్టార్ట్ చేసే అవకాశం ఉంది.