పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుండగా.. ఇప్పుడు నిర్మాణ రంగంపై కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిమెంట్ ధరలు పెరుగుతాయా? అన్న చర్చ జరుగుతుండగానే.. సిమెంట్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నాన్-ట్రేడ్ కస్టమర్లకు సిమెంట్ ధరలను ఏకంగా రూ.50 వరకు పెంచాయి. దీంతో ప్రస్తుతం 280 నుంచి 320 రూపాయల వరకు ఉన్నా.. తర్వాత 370 వరకు పెరగనుంది. కొన్నిచోట్ల 420 రూపాయల వరకు కూడా పెరుగుతుంది.
సిమెంట్ కంపెనీల నిర్ణయం నిర్మాణ రంగంపై మరింత భారం మోపేలా మారింది. ఇంధన ధరల పెరుగుదల, రవాణా ఖర్చుల పెరుగుదల నేపథ్యంలో కంపెనీలు ఈ ధరల పెంపును అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇక రెగ్యులర్ కస్టమర్లకు నాలుగో తేదీ అర్ధరాత్రి నుంచి రూ.50 రూపాయలకు పైగా ఒక్కో బస్తాకు ధర పెరుగుతుందని తిరుపతి డీలర్లు చెబుతున్నారు. పాత ధరలకే స్టాక్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఈరోజు ఆసక్తి చూపిస్తున్నారు.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం విమానయాన రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, జెట్ ఫ్యూయల్ ధరలు అమాంతంగా పెరగడంతో.. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. పెరిగిన ఇంధన భారం కారణంగా విమానయాన సంస్థలు ఆ అదనపు ఖర్చును ప్రయాణికులపైనే మళ్లించే పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే విజయవాడ నుంచి రెండు అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేశామని విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు.