Cyber Crime: అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ టెక్ సపోర్ట్, నేరాలు, బెదిరింపులు, క్రిప్టోకరెన్సీ ర్యాన్సమ్ పేరిట కోట్ల రూపాయలు దోచుకుంటున్న అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) రట్టు చేసింది. పంజాబ్, ఢిల్లీ కేంద్రాలుగా నకిలీ కాల్ సెంటర్లు నడుపుతున్న ఈ సిండికేట్ ప్రధాన నిందితుడితో పాటు అతడి ముగ్గురు సహచరులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ముఠా బాధితుల కంప్యూటర్ స్క్రీన్లపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధులుగా నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లను ప్రదర్శించేది. ఆ నంబర్లకు ఫోన్ చేసిన అమెరికన్ల కంప్యూటర్లను సరిచేస్తామని చెప్పి భారీగా నగదు బదిలీ చేయించుకునేవారు. అంతేకాకుండా, బాధితులపై చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన నేరాల ఆరోపణలు ఉన్నాయని భయభ్రాంతులకు గురిచేసి, క్రిప్టోకరెన్సీ ఏటీఎంల ద్వారా బిట్కాయిన్ రూపంలో ర్యాన్సమ్ వసూలు చేసేవారు. ఇలా సేకరించిన నిధులను అంతర్జాతీయ క్రిప్టో వాలెట్ల ద్వారా మళ్లించి, ఢిల్లీలోని ఆపరేటర్ల సహాయంతో మనీలాండరింగ్కు పాల్పడేవారు.
దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆగస్టు 5-6 మధ్య రాత్రి పంజాబ్లోని మొహాలీ, ఢిల్లీలోని 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 20కి పైగా మొబైల్ ఫోన్లు, 15 ల్యాప్టాప్లు, పలు హార్డ్డిస్క్లు, పెన్డ్రైవ్లు, భారీ మొత్తంలో నగదు, క్రిప్టో వాలెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా బారిన పడి అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ 2022లో 4.40 లక్షల డాలర్లు కోల్పోగా, 2023లో న్యూజెర్సీకి చెందిన మరొక మహిళ కంప్యూటర్ హ్యాక్ అయిందనే నెపంతో 1.30 లక్షల డాలర్లు పోగొట్టుకుంది. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ మోసాలపై సీబీఐ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.

