మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర పాలిటిక్స్ను తలకిందులు చేశాయి. దీంతో అజిత్ వర్గం ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలతో అజిత్ వర్గం ఎమ్మెల్యేలు నిరుత్సాహంలో ఉన్నారు. తిరిగి శరద్ పవార్ గూటికి చేరచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై శరద్ పవార్ స్పందిస్తూ.. అలా వచ్చే వారికి తలుపులు ఎప్పుడూ తెరచే ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. అయితే చేర్చుకునే ముందు తన సహచరులతో సంప్రదిస్తానని స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి సూర్యకాంత్ పాటిల్ తిరిగి పార్టీలో చేరిన సందర్భంగా మీడియా సమావేశంలో శరద్ పవార్ ఈ విధంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: Rishi Sunak: అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో అక్టోబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ వర్గం ఎన్సీపీకి చెందిన 18 నుంచి 19 ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో పది స్థానాల్లో పోటీ చేసిన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎనిమిది చోట్ల విజయం సాధించింది. అజిత్ వర్గం మాత్రం నాలుగు చోట్ల పోటీ చేసి ఒకే స్థానానికి పరిమితం అయ్యింది. మొత్తానికి లోక్సభ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్ని తారుమారు చేశాయి.
ఇది కూడా చదవండి: Bihar: పానీపూరి విషయంలో అత్త-కోడలు మధ్య గొడవ.. చివరికి ఏమైందంటే..?