Drone Smuggling: పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ స్మగ్లర్ల కుట్రలను సరిహద్దు భద్రతా దళం (BSF), పంజాబ్ పోలీసులు మరోసారి భగ్నం చేశారు. గురువారం రాత్రి అటారీ సరిహద్దు పరిసరాల్లో నిర్వహించిన మెరుపు సోదాల్లో భారీ ఎత్తున నకిలీ కరెన్సీతో పాటు మాదక ద్రవ్యాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థానీ స్మగ్లర్లు డ్రోన్ల సహాయంతో భారత భూభాగంలోకి నిషేధిత వస్తువులను జారవిడిచినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సైనికులు, పంజాబ్ పోలీసు బృందాలు సరిహద్దు వెంట గాలింపు చేపట్టాయి. ఖన్గఢ్లోని బోర్డర్ అవుట్పోస్ట్ (BOP) వద్ద గాలిస్తుండగా, స్మగ్లర్లు జారవిడిచిన ఒక ప్యాకేజీ భద్రతా దళాలకు చిక్కింది.
READ ALSO: Latest Weather Update : ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. రేపు ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం..}
ఏమేం దొరికాయంటే..
స్వాధీనం చేసుకున్న ప్యాకెట్లను తనిఖీ చేయగా, అందులో రూ. 2.5 లక్షల విలువైన నకిలీ భారతీయ కరెన్సీ బయటపడింది. మరో ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో సుమారు 1.5 కిలోల హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కోట్లలో ఉంటుందని అంచనా. ఈ ఘటనపై లోపోకే పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని నిందితులపై కేసులు నమోదయ్యాయి. ఈ సరుకును సరిహద్దు అవతలి నుంచి ఎవరు పంపారు? ఇక్కడ ఎవరికి అందజేయాల్సి ఉంది? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. సరిహద్దుల్లో డ్రోన్ల సంచారంపై బీఎస్ఎఫ్ నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది.