NTV Telugu Site icon

KCR : రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమం

Kcr

Kcr

రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రేస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి..ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం,మోసం చేయడం, దగా చేయడమే” నని కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్ర కాంగ్రేస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది.?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రేస్ ప్రభుత్వం మరోసారి వంచించింద”న్నారు. “ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహం తోనే ఉన్నారు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రేస్ పార్టీ మోసం చేస్తున్నది. అందు కారణంగానే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది.” అని కేసీఆర్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నదని..ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేదిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బిఆర్ఎస్ శ్రేణులు పోవాలని.. రైతులకు అండగా నిలవాలని బీఆర్ఎస్అధినేత పిలుపునిచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అధినేత కేసీఆర్ పునరుద్ఘటించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమం, కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసన కు పిలుపు ఇచ్చారు కేసీఆర్.