ఇద్దరి ఇష్టాలతో జరిగితేనే ఆ పెళ్లికి ఓ అర్థం. ఆ జంట నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవిస్తుంది. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా వారి దాంపత్య జీవితం నిత్య నరకమే. అందుకే అబ్బాయి, అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాకే ముందుకు సాగుతుంటారు పెద్దలు. ఇదే విధంగా ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. ఇక పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చింది వధువు. తనకు పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోవడంతో తాను ప్రేమించిన ప్రియుడితో పారిపోయింది. విషయం తెలిసి ఇరు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.
Also Read:Crime News: కార్లు రెంటుకు తీసుకొని 50 లక్షల టోకరా!
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ కు చెందిన అనిత అనే యువతికి, హుస్నాబాద్ కు చెందిన మొగిలికి నిన్న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే అనిత ప్రియుడితో పారిపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనిత ప్రియుడితో పారిపోవడంతో అనిత చెల్లెలు లలితతో అక్కకు నిశ్చయించిన రోజునే పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు తల్లిదండ్రులు. అదే వరుడికి చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. లలిత మైనర్ అని అధికారులకు సమాచారం ఇచ్చాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి.
Also Read:Road Accident: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు!
సమాచారం అందుకున్న వెంటనే ఐసిడిఎస్ అధికారులు, పోలీసులు పెళ్లి మండపానికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనారిటీ తీరకుండానే పెళ్లి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంతలోనే చెల్లెలు లలిత కూడా ఇంట్లో నుంచి పరారైంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఊహించని ఘటనతో తల్లిదండ్రులు, బంధువులు అయోమయంలో పడిపోయారు. ఇది తెలిసిన పలువురు ప్రేమ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహానికి ఒప్పుకోవడం ఎందుకు ఆ తర్వాత పెళ్లి ఇష్టం లేదని పారిపోయి కన్న వారి పరువు తీయడం ఎందుకు అని కామెంట్ చేస్తున్నారు.