Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…

Botsa

Botsa

విజయనగరంలో జరిగిన వైఎస్సార్‌సీపీ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ మారేవారి గురించి కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఒకరు వెళితే, వంద మంది కొత్త నాయకులు వస్తారని ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడిన నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరైతే ఆర్థిక లావాదేవీలు జరిపి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి దోపిడీకి అలవాటు పడతారో, అలాంటి దోపిడీదారులే పార్టీని వీడి వెళ్లారని మండిపడ్డారు. పార్టీలో నిజాయితీగా ఉండే గౌరవప్రదమైన వ్యక్తులు ఎవరూ వెళ్లిపోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి నేతల తీరు చూస్తుంటే ప్రజలకు, నాయకులకు బీపీ పెరిగిపోతుందని ఎద్దేవా చేశారు. కూటమి నాయకుల తీరు అచ్చం ‘అలీబాబా 40 దొంగల’ కథలా ఉందని, వారంతా ఒక్కటై రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

రాబోయే కాలంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టాలని బొత్స సత్యనారాయణ పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. వార్డు సభ్యుల నుంచి మొదలుకొని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాల వరకు ప్రతి ఒక్కరూ పట్టుదలతో గెలవాలని సూచించారు. కార్యకర్తలు ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్నారు. ప్రతి వైఎస్సార్‌సీపీ నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.