Bhatti Vikramarka : భట్టి కీలక పిలుపు.. కలిసి ఎదిగితేనే దక్షిణాది బలం.!

  • సహకార సమాఖ్యతోనే అభివృద్ధి
  • కృష్ణా జలాలపై తెలంగాణ వాదన
  • విభజన సమస్యలకు త్వరగా పరిష్కారం
  • హైదరాబాద్‌లో తదుపరి భేటీకి ప్రతిపాదన
Bhatti

Bhatti

మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ (Southern Zonal Council) సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పాల్గొని పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కేంద్ర-రాష్ట్రాల మధ్య, అలాగే పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఈ జోనల్ కౌన్సిల్ ఒక ప్రధాన వేదికగా దోహదపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మహాబలిపురం చారిత్రక కట్టడాలను ఉదహరిస్తూ.. ఒక బలమైన నిర్మాణం ఏర్పడాలంటే అన్ని భాగాలు ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని, ప్రతి భాగం తన బాధ్యతను సమర్థవంతంగా మోస్తే సరిపోతుందని పేర్కొన్నారు. అభిప్రాయ భేదాలు వచ్చినా న్యాయమైన మార్గంలో పరిష్కారం కనుగొన్నప్పుడే నిజమైన సమాఖ్య వ్యవస్థ వ్యక్తమవుతుందని స్పష్టం చేశారు.

పోటీ , సరిహద్దులు లేని సమస్యలు

పెట్టుబడులు, పరిశ్రమలు , ఉద్యోగాల కోసం రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం సహజమేనని, అయితే కొన్ని సమస్యలు మాత్రం రాష్ట్ర సరిహద్దులకు అతీతంగా ఉంటాయని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. నదులు, విద్యుత్ గ్రిడ్లు, శ్రామికులు , వ్యాపారాలు ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా విస్తరించి ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా “ప్రభుత్వ ఫైళ్ల కంటే సమస్యలే వేగంగా సరిహద్దులు దాటుతాయి” అని చమత్కరిస్తూ, ఇటువంటి సమస్యల పరిష్కారానికి జోనల్ కౌన్సిల్ వేదికలు అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు.

కృష్ణా జలాల కేటాయింపులు & ప్రాజెక్టులకు కేంద్ర సహాయం

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రం ఎలాంటి ప్రత్యేక హక్కులను కోరడం లేదని, చట్టబద్ధంగా దక్కాల్సిన న్యాయమైన వాటాను మాత్రమే అడుగుతోందని తేల్చిచెప్పారు. దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించేలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన నీటి కేటాయింపుల అంశం ప్రస్తుతం కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ (KWDT-II) ముందు ఉందన్నారు.

అలాగే, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణతో పాటు తుమ్మిడిహట్టి వద్ద ప్రణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర విభజన సమస్యలకు ముగింపు పలకాలి

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చి 12 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా అనేక విభజన సమస్యలు పెండింగ్‌లోనే ఉండటంపై డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. షెడ్యూల్ IXలోని 23 ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల విభజనపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించిందని వెల్లడించారు. షెడ్యూల్ X సంస్థల ఆస్తుల విభజన విషయంలో చట్టపరమైన నిబంధనలను, హైకోర్టు పరిధిలోని అంశాలను గౌరవించాల్సి ఉందని పేర్కొన్నారు.

దక్షిణ రాష్ట్రాల భాగస్వామ్యం & హైదరాబాద్‌కూ ఆహ్వానం

నీటి భద్రత, ఇంధనం, వాతావరణ మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ , ఆర్థిక పోటీతత్వం వంటి భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దక్షిణ రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. “దక్షిణ భారతదేశం కలిసి ఎదుగుతే, భారత్ ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది” అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వలేదని గుర్తు చేస్తూ, రాబోయే 32వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రతిపాదించారు.