Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రాన్ని తమ పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ కె. శ్రీకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు సమావేశంలో ఆయన మాట్లాడారు. బే ఏరియాలోని ఐటీ, వైద్యం, మానవ వనరుల రంగాలకు చెందిన ప్రముఖ ఎన్నారైలు, వ్యాపార నాయకులు హాజరైన ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, భవిష్యత్ ప్రణాళికలను డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా వివరించారు. హైదరాబాద్ నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ సర్వీసెస్ రంగాల్లో భారతదేశంలోనే అగ్రగామి కేంద్రంగా ఎదుగుతోందని ఆయన గుర్తుచేశారు. పారదర్శక పరిపాలన, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోందని తెలిపారు. నూతన ఆలోచనలను వ్యాపారాలుగా మార్చడంలోనూ, నాణ్యమైన ఉపాధి కల్పనలోనూ పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అడుగులు వేయాలని ఆహ్వానించారు.

రాష్ట్రంలో చేపడుతున్న కీలక ప్రాజెక్టుల గురించి వివరిస్తూ.. మూసీ నది పునరుద్ధరణ, సమగ్ర పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ యువతను అంతర్జాతీయ స్థాయి పోటీకి సన్నద్ధం చేసేందుకు ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు అత్యాధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అంతకుముందు మాట్లాడిన కాన్సుల్ జనరల్ శ్రీకర్ రెడ్డి.. ప్రవాస భారతీయులు, ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాలు బలోపేతం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఐఓసీ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధిపై ఎన్నారై ప్రతినిధులతో నిర్వహించిన ఈ చర్చలు ఎంతో అర్థవంతంగా సాగాయి.