స్నేహితులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవడం.. ఒకరి బాధలు మరొకరు పంచుకోవడం అనేది ఫ్రెండ్షిప్లో కామన్. సినిమాల్లో చూసినట్లుగా ప్రేమికులకు స్నేహితులు సహాయం చేయడం చాలా చూసుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కొన్నిసార్లు ఎలాంటి ఇబ్బందులు రావుగానీ.. ఇంకొన్ని సార్లు మాత్రం ప్రాణాల మీదకు వస్తుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఓ జంట పారిపోవడానికి సహకరించిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు స్నేహితుడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని బాగలగుండెకు చెందిన పండ్ల వ్యాపారి కిరణ్(22), ఆటో డ్రైవర్ అక్షయ్ (21), కెంగేరికి చెందిన వెయిటర్ హేమంత్ (22) ఈ ముగ్గురూ స్నేహితులు. వీరికి కెంగేరిలోని ఓ హోటల్లో పనిచేసే మరో వెయిటర్ మరిస్వామి కూడా పరిచయం ఉన్నాడు.
గత రెండు నెలలుగా కిరణ్ భార్యతో మరిస్వామికి శారీరిక సంబంధం ఏర్పడింది. దీంతో ఆమెతో పారిపోవాలని మరిస్వామి నిర్ణయించుకున్నాడు. స్నేహితుడైన హేమంత్ సహాయం కోరాడు. అందుకు అతడు సరే అన్నాడు. ఇంకేముంది కిరణ్ భార్య, మరిస్వామి పారిపోయేందుకు హేమంత్ సహకరించాడు. ఈ విషయం తెలుసుకున్న కిరణ్.. హేమంత్పై పగతో రగిలిపోయాడు. తన భార్య పారిపోవడానికి స్నేహితుడే సహకరిస్తాడంటూ హేమంత్ను చంపేయాలని కిరణ్ ప్రణాళిక రచించాడు. దీనికి అక్షయ్ సహాయంతో హేమంత్ను కిరణ్ చంపేశాడు.
హేమంత్ హత్య కేసు వెలుగులోకి రావడంతో నిందితులు కిరణ్, అక్షయ్ను బాగలగుండె పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. సాయం చేసిన పాపానికి ఒకరు ప్రాణాలు పోగొట్టుకుంటే… ప్రాణాలు తీసిన మరో ఇద్దరు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.