Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1లో డిమాండ్ చేసింది. గతేడాది జూలై-ఆగస్టులో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా 1,400 మంది మరణించారు. ఈ మరణాలను హత్యలుగా అభివర్ణించింది తాత్కాలిక ప్రభుత్వం.. హత్యలకు గాను హసీనాకు “1,400 మరణశిక్షలు” విధించాలని తాత్కాలిక ప్రభుత్వ న్యాయవాది ICT-1లో వాదించారు. గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వచ్చిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్లోనే ఉన్న విషయం తెలిసిందే.
READ MORE: Earthquake: ఫిలిప్పీన్స్ను వదలని భూకంపాలు.. మరోసారి భారీగా ప్రకంపనలు!
ఢాకా ట్రిబ్యూన్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం తన వాదనను వినిపించారు. విద్యార్థి ఉద్యమ సమయంలో జరిగిన మారణకాండ వెనుక షేక్ హసీనా ప్రధాన సూత్రధారి ఆయన ఆరోపించారు. షేక్ హసీనా నిరసన కారులపై కాల్పులు జరపాలని స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి హత్యకు వేర్వేరు శిక్షలు విధిస్తే, హసీనాను 1,400 సార్లు ఉరితీయాలి. అది సాధ్యం కాదు కాబట్టి, ఆమెకు కనీసం ఒక మరణశిక్షనైనా విధించాలని డిమాండ్ చేస్తున్నాం, లేకుంటే అది బాధితులకు అన్యాయం అవుతుందని వాదించారు. మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) చౌదరి అబ్దుల్లా అల్-మామున్లకు సైతం మరణశిక్ష విధించాలని చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. ఈ ముగ్గురు ముందస్తు ప్రణాళికతో నేరాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.