NTV Telugu Site icon

Bandi Sanjay: బడ్జెట్‌ అంతా డొల్ల.. శుష్క వాగ్దానాలు-శూన్య హస్తాలే..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ అంతా డొల్ల అని.. ఎలక్షన్ స్టంట్‌ను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శుష్క వాగ్దానాలు-శూన్య హస్తాలేనంటూ ఆయన ఎద్దేవా చేశారు. ‘ఆత్మస్తుతి – పరనింద’ మాదిరిగా కేంద్రాన్ని తిట్టడం.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడటం తప్ప ఏమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా మొండి చేయి చూపేలా ఉందన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదన్నారు. ప్రతిపాదిత బడ్జెట్‌లో 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయని కేసీఆర్ ప్రభుత్వ తీరును చూస్తుంటే… మాటలు కోటలు దాటుతున్నయ్… చేతలు గడప దాటడం లేదనే సామెతకు అద్దం పడుతోందన్నారు.

రూ.లక్షలోపు రైతులకు రుణమాఫీ చేయాలంటే రూ.19,700 కోట్లు నిధులు కావాలి. కానీ ఈ బడ్జెట్ లో రూ.6,285 కోట్లు మాత్రమే కేటాయించారని బండి సంజయ్‌ పేర్కొన్నారు. ‘దళిత బంధు’ పథకం పేరుతో ప్రజలను మరోసారి దగా చేశారన్నారు. గతేడాది దళిత బంధు పథకం కింద కూడా రూ. 17,700 కోట్లు కేటాయించినా పెద్దగా ఖర్చు చేయలేదు. రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలంటే మరో శతాబ్దం సమయం కూడా సరిపోదన్నారు. యావత్ దళిత సమాజాన్ని మోసం చేసే బడ్జెట్ ఇది అంటూ మండిపడ్డారు. గిరిజన శాఖకు కేటాయించిన నిధులు గిరిజన బంధు అమలుకు ఏ మాత్రం చాలని పరిస్థితి. ఇది ముమ్మాటికీ గిరిజనులను మోసం చేయడమేనన్నారు. రాష్ట్రంలో 52 శాతానికిపైగా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో 2 శాతం నిధులే కేటాయించడం బాధాకరమన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులను పరిశీలిస్తే.. ఈసారి కూడా బీసీ విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కు కాబోతున్నట్లు అర్ధమవుతోందన్నారు.

Read Also:BRS MPs: ఇతర రాష్ట్రాల మాదిరిగా కేంద్రం తెలంగాణకు సహకరించాలి

విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా బడ్జెట్ కేటాయింపులున్నాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలోని ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబం తమ సంపాదనలో విద్య, వైద్యానికి 50 శాతానికిపైగా ఖర్చు చేస్తున్నారు. మొత్తం బడ్జెట్‌లో విద్యకు 7 శాతం, వైద్యానికి 4 శాతంలోపు మాత్రమే నిధులు కేటాయించడాన్ని చూస్తుంటే పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపేలా బడ్జెట్ కేటాయింపులు ఉండటం దారుణమన్నారు. సాగునీటి పారుదల శాఖకు కేటాయించిన నిధులు అప్పులకు వడ్డీలకు కట్టడానికి, సిబ్బంది జీతభత్యాలకే సరిపోయేలా ఉందన్నారు. విద్యుత్ శాఖకు ఈ బడ్జెట్‌లో కేటాయించిన రూ. 12 వేల కోట్లు ప్రభుత్వ శాఖల కరెంట్ బిల్లుల బకాయిలు కట్టడానిక కూడా సరిపోవన్నారు. కరెంట్ బకాయిలే రూ.20 వేల కోట్లకు పైగా ఉన్నాయన్నారు. మొత్తంగా డిస్కంలు రూ.60 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయన్నారు. డిస్కంలను మరింత సంక్షోభంలో నెట్టేలా కేటాయింపులున్నాయని ఆయన మండిపడ్డారు.

Read Also: Jagga Reddy: పుస్తకమే చాలా లావుగా ఉంది.. అందులో మ్యాటర్‌ లేదు..

రాష్ట్రంలో ఇండ్లు లేని వారి సంఖ్య లక్షల్లో ఉంటే బడ్జెట్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు కేటాయించిన రూ.12 వేల కోట్లు ఏమూలకు సరిపోవన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి చెల్లిస్తున్న రూ.2.63 లక్షల సొమ్మును తన ఖాతాలో వేసుకోవడానికి బడ్జెట్‌లో నిధులను చూపినట్లు అర్ధమవుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని, నిధులివ్వడం లేదని పదేపదే విమర్శిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం నిధులతో నిర్మించిన రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులు, వీధి దీపాల ఏర్పాట్లన్నీ తామే చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ చెప్పుకోవడం నీచ రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. రాష్ట్రంలో సాగునీటి ఆయకట్టు భారీగా పెరిగిందని పచ్చి అబద్ధాలు వల్లించారని.. కేసీఆర్ సర్కార్‌కు దమ్ముంటే ఏ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎన్ని ఎకరాల సాగు పెరిగిందో వివరించాలన్నారు. తెలంగాణలో ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అనే పదమే ఉండదని, అందరినీ పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి 9 ఏళ్లుగా రెగ్యులరైజ్ చేయకపోగా.. ఉన్న ఉద్యోగాలను ఊడపీకిన కేసీఆర్ బడ్జెట్‌లో మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామనడం పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు.

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఇంతకు ముందు నుంచే గ్రామ పంచాయతీల్లో నేరుగా నిధులను జమ చేస్తుంటే ఆ నిధులను సర్పంచ్‌లకు తెలియకుండా డిజిటల్ సంతకాల పేరుతో తస్కరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు జమ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పరిపాలనా వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నదే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని బడ్జెట్‌లో పేర్కొనడం మిలీనియం ఆఫ్ ది జోక్ అని బండి సంజయ్ పేర్కొ్న్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 50 వేల జీవోలను బయటపెట్టకుండా దాచేసిన దొంగ, సెక్రటేరియేట్‌ను కూల్చేసి పాలనా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గుడు, దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పరుడు.. అవినీతిరహిత, పారదర్శకత పాలన గురించి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఆయన ధ్వజమెత్తారు.

Read Also: KTR: తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6బిలియన్ల పెట్టుబడి.. 4లక్షల ఉద్యోగాలు

రాష్ట్ర ఆదాయానికి, కేటాయింపులకు, ఖర్చులకు ఏ మాత్రం పొంతన లేని బడ్జెట్ అంటూ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఉద్యోగులకు ప్రతినెలా ఏరోజు జీతాలిస్తారో చెప్పలేని ప్రభుత్వం బడ్జెట్ పేరుతో చేస్తున్ప అంకెల గారడీని చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. రూ. 2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం రూ.1.31 లక్షల కోట్లుగానే చూపింది. మిగిలిన రూ.1.60 లక్షల కోట్లు ఎక్కడి నుండి సమకూరుస్తారో చెప్పకపోవడం సిగ్గు చేటన్నారు. కేంద్రం గ్రాంట్లు, పన్నుల వాటా రూపేణా ఈ బడ్జెట్‌లో రూ.62 వేల కోట్లకు పైగా చెల్లిస్తోందన్నారు. ఇవిపోగా మిగిలిన ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం మద్యం, భూముల అమ్మకంతోపాటు అప్పుల ద్వారా, ప్రజలపై భారం మోపడం ద్వారా మాత్రమే సమకూర్చుకునేందుకు కుట్ర చేస్తోందన్నారు. కేసీఆర్ సర్కార్ డొల్ల బడ్జెట్‌ను బీజేపీ పక్షాన ప్రజల్లో ఎండగడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు.