Telangana BJP Chief Bandi Sanjay Made Comments On CM KCR.
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణలో హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎన్టీవీతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నిక రావాలని టీఆర్ఎస్ కోరుకుంటుందని, రావద్దని కాంగ్రెస్ కోరుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పాత బస్తీలోనూ పాగా వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలని అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని, సొంతంగా ప్రకటించుకునే సంప్రదాయం పార్టీలో లేదన్నారు బండి సంజయ్.
టీఆర్ఎస్కి 15 సీట్ల కన్నా ఎక్కువ రావని, మోడీ, నడ్దాలే మా బాస్లు అని ఆయన అన్నారు. ఎవరైనా కాషాయ జెండా కింద పని చేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ ఆటలు చెల్లవని, ఇన్ని రోజులు ప్రత్యామ్నాయం లేక అందరూ అణిగి మణిగి ఉన్నారన్నారు. కేసీఆర్ కుటుంబం ఎవరు ఎక్కడ ఉన్నారో ప్రజలు అందరూ చూస్తున్నారన్నారు. ఏ మాఫియా వెనుక అయిన టీఆర్ఎస్ నేతలు ఉంటారని, హైదరాబాద్ లో వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదన్నారు. వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు.