NTV Telugu Site icon

Bandi Sanjay : తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లను ఎందుకు కొనడం లేదు?

Bandi Sanjay

Bandi Sanjay

కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కార్ కు పట్టవా? అన్ని రకాల వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వాల్సిందే అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విపలమైన ప్రభుత్వం… పండించిన వడ్లను సైతం సకాలంలో కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తుండటంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదారు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ ముందస్తు సమాచారమిచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం కల్లాల వద్ద వడ్ల కొనుగోలును వేగవంతం చేయకపోవడంతోపాటు కొనుగోలు కేంద్రాలవద్ద వడ్లు తడవకుండా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దుర్మార్గం. దీంతో ప్రతిరోజు వానకు పదే పదే వడ్లు తడిసిపోవడం, తిరిగి వాటిని అరబెట్టేందుకు రైతులు తిండితిప్పలు మాని అష్ట కష్టాలు పడాల్సిన రావడం అత్యంత బాధాకరం. కొన్ని చోట్లు అన్ని ఇబ్బందులను అధిగమిస్తూ అన్నదాతలు వడ్లను ఆరబెట్టినప్పటికీ సకాలంలో వాటిని కొని, వారికి విముక్తి కలిగించే నాథుడే కరువయ్యారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్న దాఖలాలే లేకపోవడం విచారకరం. తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 5 నుండి 10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇచ్చిన హామి ప్రకారం కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా క్వింటాలుకు రూ.200 నుండి రూ.500 ల వరకు రైతులు నష్టపోతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే, సీఎం ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయని తెలిసిపోయింది..

అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా… కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పేపర్ పై రాసిచ్చిన హామీలను పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ గెలిచాక, కల్లాలకు రెండో పంట వచ్చినా… క్వింటాలుకు రూ.500ల బోనస్ హామీకి దిక్కు లేదు. బోనస్ ఇవ్వకపోగా సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు రావడం, దొడ్డు రకం వడ్లనే పండించిన అత్యధిక శాతం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై రైతాంగానికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో వడ్ల కొనుగోలు సగానికిపైగా పూర్తయినట్లు మా దృష్టికి వచ్చింది. కొనుగోలు చేసిన వడ్లకు సైతం సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని వడ్లు కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలి. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కొనుగోలు చేసి కనీస మద్దతు ధర చెల్లించాలని, తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు వడ్ల కోనుగోలు చేయాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

మరో ముఖ్యమైన అంశమేమిటంటే యాసంగిలో అకాల వర్షాలతో ప్రతిఏటా రైతులు నష్టపోతూనే ఉన్నా నష్ట పరిహారం అందించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమయ్యాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యాసంగి సీజన్ లో కురిసిన అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, మామిడి పంట నష్టం జరిగినా నేటికీ పరిహారం అందనేలేదు. ఒక్కో రైతు సగటున ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులపై అదనంగా మరో రూ.10 వేల భారం పడింది. వీరందరికీ కనీసం పంటల బీమా పథకాన్ని కూడా వర్తింపజేయడం లేదు. ప్రభుత్వ సాయం అందక, చేసిన అప్పులు తీరక జిల్లా రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. వారి దుస్థితిని సహృదయంతో అర్థం చేసుకుని యుద్ద ప్రాతిపదికన నష్ట పరిహారం అందించాలని బీజేపీ పక్షాన కోరుతున్నాం.

అట్లాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఒక్కో ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు చెల్లిస్తామని హమీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సుమారు 6 నెలలైనా రైతు భరోసా కింద రైతుకు సాయం అందలేదు. రూ.2 లక్షల రుణమాఫీ కాలేదు. పండించిన పంటకు డబ్బులు రాక, ప్రభుత్వం నుండి సాయం అందక, చేసిన అప్పులు తీరక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనికితోడు వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతోంది. వ్యవసాయానికి పెట్టుబడి లేక, బ్యాంకుల నుండి కొత్త అప్పులు పుట్టక రైతులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో రేపు(సోమవారం) జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడంతోపాటు వారికి ఉపశమనం కలిగేలా నిర్ణయాలు తీసుకుని యుద్ద ప్రాతిపదికన వాటిని అమలు చేయాలి. ముఖ్యంగా రాబోయే నాలుగైదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో కల్లాల వద్ద ఉన్న వడ్లను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చి రైతులను ఆదుకోవాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.