Balineni Srinivasa Reddy: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.. దీంతో.. సినీ, రాజకీయ ప్రముఖులు థియేటర్లలో సందడి చేశారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్లో.. మరీ ముఖ్యంగా తన జిల్లా ప్రకాశంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయిన వేళ.. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి.. గుంటూరు కారం సినిమా చూస్తూ రిలక్స్ అవుతున్నారు.. ఆ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
Read Also: Mallanna Jatara: రేపటి నుంచి ఐనవోలు మల్లన్న జాతర.. ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభం
గురువారం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో లిస్ట్ను ప్రకటించింది.. ఆ లిస్ట్లోనూ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ఖరారు కాలేదు.. దీంతో.. మరోసారి ప్రకాశం జిల్లా వైసీపీలో అనిశ్చితి నెలకొన్నట్టు అయ్యింది.. మాగుంట కోసం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని పట్టుబట్టారు.. ఆ మధ్యే సీఎంవోకు వెళ్లి.. ఆ తర్వాత ఐప్యాక్ టీమ్ను కలిసి కూడా చర్చించారు. ఆ తర్వాత మాగుంటకు సీటు ఫైనల్ అని ప్రచారం సాగినా.. వైసీపీ అధిష్టానం ఇప్పటికీ ఆయన పేరు ప్రకటించలేదు. మరోవైపు.. ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరణ చేసిన భూములకు నగదు బదిలీ వ్యవహారం కూడా కొలిక్కిరాలేదు. గత కొద్ది నెలలుగా భూములకు నగదు వేయాలంటూ సీఎంవో అధికారుల చుట్టూ తిరిగిన బాలినేని.. చివరకు సీఎం వైఎస్ జగన్ వద్ద కూడా ఈ వ్యవహారాన్ని ప్రస్తావించారు.
Read Also: Atal Setu: ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
మరోవైపు వైసీపీ థర్డ్ లిస్ట్ లో మార్కాపురం ఇంచార్జీగా మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పేరు కూడా కనిపించలేదు.. దీంతో.. బాలినేని మరోసారి అలకబూమినట్టు ప్రచారం సాగుతోంది.. బాలినేనితో సంప్రదింపుల కోసం అధిష్టానం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ రోజు కొండేపిలో నూతన వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గా మంత్రి ఆదిములపు సురేష్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు.. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఇంఛార్జ్ మాదాసి వెంకయ్య కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో.. హైదరాబాద్లోని ఏఎంబీ మాల్లో కొందరు తన సహచరులతో కలిసి గుంటూరు కారం సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు బాలినేని.. గుర్తుతెలియని వ్యక్తి ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వదలడంలో.. అది కాస్తా వైరల్గా మారిపోయింది. మొత్తంగా జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతుండగా. మాజీ మంత్రి బాలినేని మాత్రం.. పాప్ కార్న్ తింటూ గుంటూరు కారం సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.