నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ కొన్ని సెంటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఓటీటీలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఓ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుందంటే గొప్ప విషయమనే చెప్పాలి. అది కూడా కరోనా వైరస్ బెంబేలెత్తిస్తున్న సమయంలో అఖండ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడం సినీ పరిశ్రమకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
Read Also: టాలీవుడ్లో మరో విషాదం.. అనారోగ్యంతో నటుడు మృతి
తెలుగు రాష్ట్రాలలో మొత్తం 103 సెంటర్లలో అఖండ 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. టాలీవుడ్లో ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా ఇన్ని సెంటర్లలో 50 రోజులు ఆడలేదు. దీంతో నందమూరి అభిమానులు భారీ ఎత్తున వేడుకలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో ఈరోజు 50 రోజుల సంబరాల కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొననుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ మూవీలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటించింది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈనెల 21 నుంచి అఖండ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
