ఇండియా, శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా అజేయంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లలో ఆసీస్ గెలిచింది. వరుస విజయాలతో సెమీస్లో దూసుకెళ్లింది. సెమీస్లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా కూడా ఆసీస్ నిలిచింది. మెగా టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన ఆసీస్.. నాలుగింట్లో గెలవగా, ఒక మ్యాచ్ రద్దయింది. నాలుగు కంటే ఎక్కువ జట్లు 9 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో.. ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్తు ఖరారయింది.
Also Read: 77th IPS Batch: 77వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్యఅతిథిగా బీఎస్ఎఫ్ డైరెక్టర్!
బంగ్లాదేశ్తో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో కంగారూ జట్టు అటు బంతితో, ఇటు బ్యాట్తో విజృంభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఏ దశలోనూ బంగ్లా పోటీ ఇవ్వలేదు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులకే పరిమితమైంది. శోభన (66 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచింది. ఛేదనలో కెప్టెన్ అలీసా హీలీ (113 నాటౌట్; 77 బంతుల్లో 20×4) మరోసారి అజేయ సెంచరీతో రెచ్చిపోయింది. హీలీ రెచ్చిపోవడంతో 24.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫోబి లిచ్ఫీల్డ్ (84) మెరిసింది.