Asia Cup 2025: పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు.. భారత జట్టును వీడిన స్టార్ ప్లేయర్!

  • యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025
  • సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌
  • భారత జట్టును వీడిన స్టార్ ప్లేయర్
Teamindia

Teamindia

యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. భారత్ తొలి మ్యాచ్‌లో యూఏఈపై ఘన విజయాన్ని సాధించింది. ఇక సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియాసిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్ జట్టును వీడాడు. ఆసియా కప్ జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న సుందర్.. టోర్నమెంట్ మధ్యలోనే జట్టును వీడి ఇంగ్లండ్‌కు బయలుదేరారు. ఇంగ్లండ్‌ ప్రసిద్ధ కౌంటీ జట్టు హాంప్‌షైర్‌లో అతడు చేరాడు. 2025 ఛాంపియన్‌షిప్‌లో చివరి రెండు మ్యాచ్‌లు సుందర్ ఆడనున్నాడు.

బీసీసీఐ సెలెక్టర్లు వాషింగ్టన్ సుందర్‌ను ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన ప్రధాన జట్టులో కాకుండా.. రిజర్వ్ స్క్వాడ్‌లో చోటు ఇచ్చారు. ప్రధాన జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్‌లు ఉన్నారు. దాంతో సుందర్‌కు ఆడే అవకాశం రాదు. ఇదే సమయంలో ఇంగ్లండ్‌ ప్రతిష్టాత్మక కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు హ్యాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ నుంచి ఆఫర్ వచ్చింది. సుందర్ ఈ ఆఫర్‌కు ఓకే చెప్పాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో హ్యాంప్‌షైర్ తరఫున మిగిలిన రెండు మ్యాచ్‌లలో సుందర్ బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని గురువారం ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ హ్యాంప్‌షైర్ ఎక్స్ వేదికగా తెలిపింది. సుందర్ జట్టులోకి రావడం పట్ల హాంప్‌షైర్ క్రికెట్ డైరెక్టర్ గైల్స్ వైట్ సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: Arjun Tendulkar: ఎంగేజ్‌మెంట్ అనంతరం మొదటి మ్యాచ్.. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన అర్జున్!

ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాటింగ్‌లో 284 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. బౌలింగ్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అతడికి హాంప్‌షైర్‌లో ఆడే అవకాశం దక్కింది. కౌంటీ క్రికెట్‌లో ఆడడం సుందర్‌కు ఇది రెండోసారి. 2022లో లంకాషైర్ తరపున ఛాంపియన్‌షిప్, వన్డే కప్ ఆడాడు. హాంప్‌షైర్ తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 15-18 వరకు టౌంటన్‌లోని కాపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్‌లో సోమర్‌సెట్‌తో ఆడనుంది. సెప్టెంబర్ 24-27 వరకు యుటిలిటీ బాల్‌లో సర్రేతో తలపడనుంది.