Ravichandran Ashwin: రేపు(ఆదివారం) టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఉంటాడా? లేదా? అనే అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో అభీపై విశ్వాసం ఉంచాలని ఆఫ్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. అయితే అదే సమయంలో అభిషేక్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు సైతం చేశాడు. సెమీ ఫైన్లో అభిషేక్ “తలతిక్క బ్యాటింగ్” చేశాడని తీవ్రంగా విమర్శించాడు. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని ఆడటం అభిషేక్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం అని సూచించాడు. గతంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో అతను అద్భుతంగా ఆడాడని గుర్తు చేశాడు. ముఖ్యంగా మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ వంటి నాణ్యమైన బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్న అనుభవం ఉందని గుర్తు చేశాడు. అందుకే ఒక్కసారి ఫామ్ తగ్గిందని వెంటనే అతనిపై నమ్మకం కోల్పోవద్దని సూచించాడు.
READ MORE: Bengaluru: బెంగళూరుకు మరో ఎయిర్పోర్ట్.. ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
అయితే సెమీస్లో అభిషేక్ ఆట తీరు తనను నిరాశ పర్చిందని అశ్విన్ తెలిపాడు. విల్ జాక్స్ బౌలింగ్లో ఎనిమిది పరుగులు సాధించిన తరువాత మరింత పెద్ద షాట్లకు ప్రయత్నించడం తప్పిదమన్నాడు. అప్పటికే మరో వైపు సంజూ అద్భుతంగా ఆడుతున్నాడని గుర్తుచేశాడు. అలాంటి సమయంలో ఒక సింగిల్ తీసుకుని స్ట్రైక్ మార్పిడి చేస్తే సరిపోయేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కొన్నిసార్లు బంతిని వదిలేయడం బ్యాటర్కు అవసరమని సూచించాడు. “అభిషేక్ ప్రతిభపై నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ అతనిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జట్టు యాజమాన్యం చూసుకోవాలి. ముఖ్యంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతనితో సరైన సంభాషణ జరపాలి. ఒత్తిడి పెరిగితే బంతిని మరింత బలంగా కొట్టాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో అభిషేక్ సహజ ఆటతీరు దెబ్బతింటుంది. అభిషేక్ స్వభావంగా టైమింగ్పై ఆధారపడే బ్యాటర్. అతన్ని సానుకూలమైన మనస్తత్వంలో ఉంచితేనే ప్రతిభ బయటపడుతుంది. అందుకే తుదిపోరులోనూ అతనికి అవకాశమివ్వాలి.” అని అశ్విన్ వివరించాడు.