ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరికాసేపట్లో తీహార్ జైలు నుంచి విడుదలకానున్నారు. శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు అందాయి. కేజ్రీవాల్ను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్కు స్వాగతం పలికేందుకు సతీమణి సునీతా కేజ్రీవాల్, కుమార్తె తీహార్ జైలుకు చేరుకున్నారు. అలాగే ఆప్ ముఖ్యనేతలు, కార్యకర్తలు జైలుకు తరలివస్తున్నారు.
ఇదిలా ఉంటే శుక్రవారం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేవలం లోక్సభ ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇచ్చినట్లు న్యాయస్థానం తెలిపింది. బెయిల్ సమయంలో సీఎం కార్యాలయం లేదా సచివాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని సూచించింది.
ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆరు విడతలో పోలింగ్ జరగనుంది. అనగా మే 25న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు. ముఖ్యమంత్రి మనవి అంగీకరించి.. ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. జైలు నుంచి రాగానే కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేయొచ్చని తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కేజ్రీవాల్ను రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. దాదాపు 50 రోజుల తర్వాత ఆయనకు విముక్తి లభించింది.