ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్, ఈడీ విధించిన రిమాండ్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన పిటిషన్ను అత్యవసరంగా ఆదివారం లోపు విచారించాలని విజ్ఞప్తి చేశారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఏడు రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. తాజాగా ఈ రిమాండ్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎమర్జెనీగా 24 గంటల్లో విచారించాలని ఆయన కోరారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ అధికారులు వరసగా తొమ్మిది సార్లు సమన్లు జారీచేశారు. 9 సార్లు ఆయన సమన్లను దాటవేశారు. అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని.. విచారణ నుంచి స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో గురువారం రాత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఇక శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ను 7 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చింది. తన అరెస్ట్, రిమాండ్ అక్రమం అని కేజ్రీవాల్ పిటిషన్లో ఆరోపించారు. తనను వెంటనే విడుదల చేయాలని పిటిషన్లో ఆయన కోరారు.
ఇక లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారు అని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కేజ్రీవాల్ మనీష్ సిసొడియా, కల్వకుంట్ల కవితతో సంప్రదింపులు జరిపారని ఆరోపించింది. ఢిల్లీలో న్యూ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్తో తనకేం సంబంధం లేదని అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చుతున్నారు. మరీ తాజా పిటిషన్పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.