విజయవాడలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ బోర్డు మెంబర్ల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ఛైర్మన్, జోనల్ ఛైర్మన్లు హాజరుకానున్నారు. ఇటీవల కొత్తగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) మారడం, అలాగే ప్రస్తుత ఎండీ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. బోర్డు సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది.
Also Read: Today Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని రీతిలో డబ్బు!
ఏపీఎస్ఆర్టీసీ బోర్డు సమావేశంలో ముఖ్యంగా ‘స్త్రీశక్తి’ పథకం అమలు పరిస్థితి, బస్సుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, ఉద్యోగుల వివిధ డిమాండ్లు, అలాగే అద్దె బస్సుల (హైర్ బస్సులు) అంశంపై విస్తృతంగా సమాలోచనలు జరగనున్నట్లు సమాచారం. బోర్డు మీటింగ్ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీతో అద్దె బస్సుల యజమానుల సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హైర్ బస్సుల నిర్వహణ, చెల్లింపులు, ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఈ వరుస సమావేశాలు ఏపీఎస్ఆర్టీసీ భవిష్యత్ నిర్ణయాలకు కీలకంగా మారనున్నాయని భావిస్తున్నారు.