ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు మరింత వేగవంతమైన, పారదర్శక సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసే కొత్త విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన 24 గంటల్లోనే అధికారుల ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నంబర్ జనరేషన్ వంటి ప్రక్రియలు కూడా ఒకే రోజులో పూర్తవుతాయని పేర్కొన్నారు. అయితే ఫ్యాన్సీ నంబర్ తీసుకునే వాహనాలకు మాత్రమే ఈ గడువు వర్తించదని చెప్పారు. కొత్త విధానంలో మరో కీలక అంశం ఆటోమేటిక్ ఆమోదం. నిర్ణయించిన గడువులోపు అధికారులు స్పందించకపోతే.. వ్యవస్థ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్ను ఆమోదించేలా టెక్నాలజీ ఆధారిత విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. దీంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు తగ్గడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు.
సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లకు ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ వాహన రిజిస్ట్రేషన్లను క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలకు సులభమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో ఈ కొత్త విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భారీ మార్పులు రానున్నాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
