మొత్తానికి ఈసారి ఎన్నికల నోటిఫికేషన్కు ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 195 మందితో కూడిన తొలి జాబితాను వెల్లడించింది. ప్రధాని మోడీతో పాటు 34 మంది కేంద్రమంత్రులు కూడా ఈ జాబితాలో కనిపించారు. అంతేకాకుండా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఈ ఫస్ట్లో ఉన్నారు.
తొలి జాబితాలో 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ జోలికి మాత్రం వెళ్లలేదు. తొలి జాబితాలో ఏపీ కూడా ఉంటుందని అనుకున్నారు. కానీ ఒక్కరు కూడా కనిపించలేదు. దీంతో ఏపీ నేతలకు నిరాశే ఎదురైంది.
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు కుదిరింది. అలాగే బీజేపీతో కూడా పొత్తు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే ఏపీ జోలికి రాలేదని తెలుస్తోంది. మరోవైపు పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను అధిష్టానం సేకరిస్తోంది. పొత్తులపై క్లారిటీ వచ్చాకే ఏపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం విజయవాడ వేదికగా బీజేపీ నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పొత్తులు-ఒంటరిగా పోటీ చేసే అంశాలపై ఢిల్లీ నుంచి వచ్చిన శివప్రకాశ్ అభిప్రాయాలను సేకరిస్తు్న్నారు. శనివారం, ఆదివారం అభిప్రాయాలు సేకరించాక.. నివేదికను ఢిల్లీ బీజేపీ పెద్దలకు అందజేయనున్నారు.
ఇదిలా ఉంటే తొలి జాబితాలో 28 మంది మహిళలతో పాటు 50 ఏళ్ల లోపు 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన 57 మందికి చోటు దక్కింది. మొత్తం 195 మందిలో 51 మంది ఉత్తర్ ప్రదేశ్ నుంచి, 20 మంది పశ్చిమ బెంగాల్ నుంచి, ఐదుగురు ఢిల్లీ నుంచి ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, తెలంగాణ నుంచి 9 మంది, కేరళ నుంచి 12 మందిని ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించింది.
మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. అమిత్ షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి , కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ గుజరాత్ పోర్బందర్ నుంచి పోటీలో ఉండనున్నారు. ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళ తిరువనంతపురం నుంచి పోటీలో దిగనున్నారు. జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ గుణ నుంచి, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి లోక్సభ బరిలో ఉన్నారు.
BJP releases first list of 195 candidates for Lok Sabha elections pic.twitter.com/ms1zTtzLfL
— ANI (@ANI) March 2, 2024