NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో టీడీఆర్‌ బాండ్ల స్కాంపై సీఐడీ విచారణ?

Tdr

Tdr

Andhra Pradesh: ఏపీలో టీడీఆర్‌ బాండ్ల స్కాం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. తణుకులో టీడీఆర్ స్కాంపై ఏసీబీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ తీసుకెళ్లారు. తణుకు టీడీఆర్ బాండ్ల స్కాం జరిగిన తీరును ముఖ్యమంత్రికి వివరించారు. టీడీఆర్ స్కాంపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. టీడీఆర్ స్కాంపై సీఐడీ విచారణకు ఆదేశించే అంశాన్ని కూటమి సర్కార్ పరిశీలిస్తోంది. సీఐడీ విచారణకు ఇస్తేనే టీడీఆర్ స్కాంపై అసలు సూత్రధారులు ఎవరనే అంశం వెలుగులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: Minister Nadendla Manohar: ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం.. 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి సొమ్ము..

టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో ప్రభుత్వం లీగల్ ఓపీనియన్ తీసుకుంటోంది. తణుకు మున్సిపాలిటీలో రూ.754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. మొత్తం రూ.691 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్థల సేకరణ సమయంలో ఎకరాల్లో గుర్తించి బాండ్ల జారీకి చదరపు గజాల్లో స్థలం లెక్కించినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎకరా రూ.55 లక్షలకు సేకరించి బాండ్ల జారీకి ఎకరా రూ.10 కోట్లు విలువ చూపడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గుర్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2019-24 మధ్య కాలంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేస్తోంది.