2026 నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు, సేవల సమయాలను పొడిగించేందుకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక అనుమతుల ప్రకారం.. డిసెంబర్ 31 మరియు జనవరి 1 రాత్రుల్లో A4 మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు విక్రయించవచ్చు.
Also Read: Virat Kohli: అభిమానులకు శుభవార్త.. మరో మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ!
అలాగే 2B బార్లు, C1 (ఇన్-హౌస్), EP1 (ఈవెంట్ పర్మిట్), TD1 (ఇన్-హౌస్) లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థలకు రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలు, సర్వీస్కు అనుమతి ఇచ్చారు. గత ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా అమలు చేసిన విధానాన్నే ఈ ఏడాదీ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలుకు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.