NTV Telugu Site icon

AP And Telangana Water War: జలం జగడం.. కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ.. ఆపే ప్రశ్నేలేదు..!

Ap

Ap

AP And Telangana Water War: ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సీఆర్పీఎఫ్‌ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, జలం జగడంపై కృష్ణా రివర్‌ బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సాగర్ స్పిల్‌ వేలో సగభాగాన్ని ఏపీ స్వాధీనం చేసుకుందని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.. కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమారు రాష్ట్ర జలవనరుల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ లేఖను పంపించారు.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్‌ను నియంత్రించడంలో కృష్ణా బోర్డు వైఫల్యం చెందిందని లేఖలో ఆక్షేపించింది ఏపీ ప్రభుత్వం.. అందుకే మా భూభాగంలోని నాగార్జున సాగర్ స్పిల్‌ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం స్వాధీనం చేసుకున్నామని లేఖలో స్పష్టం చేసింది.

Read Also: IPL Auction 2023: ఐపీఎల్ వేలంలో 1166 మంది ప్లేయర్లు.. 77 ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీల ఆసక్తి

ఏపీకి కేటాయించిన నీటిని తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు విడుదల చేశామని లేఖలో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. సాగర్ కుడి కాలువ కింద మాకు కేటాయించిన 15 టీఎంసీల్లో ఇప్పటివరకు ఐదు టీఎంసీలు వాడుకున్నాం. మిగిలిన పది టీఎంసీలను వాడుకోనివ్వకుండా సాగర్‌ను తెలంగాణ ఖాళీ చేస్తే.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడం సవాల్‌గా మారుతుందని రాసుకొచ్చింది.. ఈ ఆందోళనతోనే సాగర్ స్పిల్ వే ను స్వాధీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేసి మా హక్కులను పరిరక్షించుకున్నాం.. నీటి విడుదలను ఆపే ప్రశ్నే లేదని కృష్ణా రివర్‌ బోర్డుకు రాసిన లేఖలో కుండబద్దలు కొట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.