NTV Telugu Site icon

Andhrapradesh: విద్యుత్‌ ఉద్యోగులతో ఫలించిన చర్చలు.. 8 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకారం

Andhrapradesh

Andhrapradesh

Andhrapradesh: విద్యుత్‌ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. పీఆర్‌సీపై ఉభయుల మధ్య ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. విద్యుత్‌ జేఏసీ 15 శాతం ఫిట్‌మెంట్‌ కోరితే రాష్ట్ర ప్రభుత్వం 8శాతం ఇచ్చేందుకు అంగీకరించింది. దీనికి విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ కూడా అంగీకరించడంతో.. ఈ ఒప్పందంపై యాజమాన్యంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు. సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్టు విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. మాస్టర్‌ స్కేల్‌ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు సబ్‌కమిటీ ఆమోదం తెలిపినట్లు జేఏసీ నేతలు తెలిపారు. అనామలీస్‌ ఉంటే సరిచేసి పేస్కేలు ఫిక్స్‌ చేయడానికి ఏపీజెన్‌కో ఎండీ నేతత్వంలో డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. విద్యుత్‌ ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించామని, విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదని చర్చలకు ముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపిన విషయం విదితమే.

Also Read: Kishan Reddy: రెండు కుటుంబ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలి

విద్యుత్‌ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతోవిద్యుత్‌ ఉద్యోగులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. పేరివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ) లో భాగంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈనెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) నోటీసు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌పీఈజేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం బుధవారం సచివాలయంలో చర్చలు జరిపింది. ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, అందరికీ మేలుచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడి మంచి నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర ఇంధన, అటవీ పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యుత్‌ సంస్థలను కాపాడుకునేందుకు అటు యాజమాన్యం, ఇటు ఉద్యోగులు ఎంతోకొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రులు, అధికారులు ఉద్బోధించారు. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈమేరకు పీఆర్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్‌కో, ఏపీసీపీడీసీఎల్, ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌ అధికారులు , జేఏసీ ప్రతినిధులు సంతకాలు చేశారు.

అనామలీస్‌ ఉంటే సరిచేసి పేస్కేలు ఫిక్స్‌ చేయడానికి ఏపీజెన్‌కో ఎండీ నేతత్వంలో డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్‌ సింగ్‌ రావత్, ఏపీజెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ చక్రధర్‌ బాబు, సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మా జనార్దన్‌ రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ మల్లారెడ్డి, ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి కుమార్‌ రెడ్డి, జేఏసీ నేతలు చంద్రశేఖర్, ప్రతాప్‌ రెడ్డి, సాయికష్ణ, శేషారెడ్డి, శ్రీనివాస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.