CM YS Jagan: బిజీబిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఓవైపు అధికారిక కార్యక్రమాలు, మరోవైపు పార్టీ సమావేశాలు, సమీక్షలు.. వివిధ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, వివిధ శాఖలపై సమీక్షలు.. ఇలా నిత్యం ఎంతో బిజీగా ఉంటున్న ఆయన.. రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్తో కలిసి.. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్ధాపన చేయనున్నారు. ఇక, దీని కోసం రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి.. విజయనగరం జిల్లాకు చేరుకోనున్న ఆయన.. మెంటాడ మండలం చినమేడపల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం జగన్.. అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
Read Also: NTR 100 Rupees Coin: ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం.. విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్
ఇక, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన పనులను పరిశీలించారు డిప్యూటీ సీఎం రాజన్నదొర.. మరోవైపు, యూనివర్సిటీ కోసం మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో భూసేకరణ జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.. మౌలిక వసతులు, నష్ట పరిహారం చెల్లింపు, ఇతర అవసరాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 58.49 కోట్ల వరకు వెచ్చిస్తుందని డిప్యూటీ సీఎం రాజన్నదొర తెలిపారు. కాగా, ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ సంబంధించిన క్లాసులను తాత్కాలిక భవనంలో కొనసాగిస్తోన్న విషయం విదితమే. ఇక, సీఎం పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. సీఎం రాకతో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.